
- ఎమర్జింగ్ టెక్నాలజీలతో ఉపాధికి ఎసరు
- ఏఐపై యాజమాన్యాలు శిక్షణ ఇవ్వట్లేదంటున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ : అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు (ఎమర్జింగ్ టెక్నాలజీలు) వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటి కారణంగా తాము ఉపాధికి దూరం అవుతామేమో అని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల గురించి టెన్షన్ పడుతున్నారని స్టడీలు చెబుతున్నాయి. వేగంగా మారుతున్న ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఆరితేరి ఉండాలని తాజా రిపోర్టు ఒకటి పేర్కొంది.
ఈ పరిస్థితి గురించి హీరో గ్రూప్ కంపెనీ హీరో వైర్డ్ రెండు లక్షల మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ సర్వే చేసి ఆసక్తికర సంగతులు రాబట్టింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల కారణంగా ఉద్యోగాల తొలగింపు ప్రమాదం ఉందని 82 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావం గురించి శ్రామిక శక్తిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 78 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేగంగా మారుతున్న పని విధానానికి అనువుగా మారడానికి స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరని అంగీకరించారు.
నేటి జాబ్ మార్కెట్లో కొనసాగాలంటే స్కిల్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, టెక్నాలజీల గురించి తెలుసుకుంటూనే ఉండాలని వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ స్పష్టం చేశారు. నిపుణులు కంపెనీలు స్థిరత్వం, ఫిట్నెస్, మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల దృష్టిని కేంద్రీకరిస్తున్నందున, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ కొనసాగుతుందని హీరో వైర్డ్ సీఈఓ అక్షయ్ ముంజాల్ చెప్పారు.
ఏఐపై పట్టు తప్పనిసరి..
సర్వేలో పాల్గొన్న 39 శాతం మంది రెస్పాండెంట్లు తమ కెరీర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై పట్టు ఉండటం కీలకమని చెప్పారు. ఇది కెరీర్ వృద్ధి అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. 43 శాతం మంది తమ యజమానులు ఏఐపై తగినంత శిక్షణ ఇవ్వడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టెక్నాలజీ డొమైన్లో అవసరానికి తగినంత మంది నిపుణులు లేరని ఈ రిపోర్టు పేర్కొంది.
మెట్రో నాన్-మెట్రో నగరాల నుంచి 18–-55 సంవత్సరాల వయస్సు గల వర్కింగ్ ప్రొఫెషనల్స్లో 43.5 శాతం మంది ప్రతి 6 నెలలకు స్కిల్ పెంచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏఐలో నైపుణ్యం పెంచుకోవడం వల్ల తమ ఉద్యోగావకాశాలు పెరుగుతాయని 83 శాతం మంది రెస్పాండెంట్లు అభిప్రాయపడ్డారు.