
Xiaomi Cars: ప్రపంచ ఆటోమెుబైల్ రంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను కంపెనీలు లాంచ్ చేస్తున్న వేళ వాటి బుక్కింగ్స్, కొనుగోళ్లు కూడా అంతే ఆదరణను చూస్తున్నాయి.
చైనా సంస్థ జియోమీ తన సరికొత్త ఎస్యూవీ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈవీ కేటగిరీలో కంపెనీ విడుదల చేసిన కారు టెస్లా మోడల్ వై తో పోటీ పడుతోంది. వైయూ7 పేరుతో రిలీజ్ అయిన ఈ కారు ఆటో లవర్స్ నుంచి భారీ స్పందనను చూసింది. 35వేల 360 డాలర్ల రేటుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు కేవలం గంటలోనే 2లక్షల 39వేల 800 బుక్కింగ్స్ నమోదయ్యాయి. దీంతో జియోమీ కార్పొరేషన్ కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతం పెరుగుదలను చూశాయి.
కార్ లాంచ్ సమయంలో జియోమీ వ్యవస్థాపకుడు లైజున్ టెస్లాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎమ్ఐ ఉత్పత్తులను ఐఫోన్లతో పోల్చారు. ప్రస్తుతం తాము పెద్ద పోటీదారుడితో తలపడుతున్నామని, అలాగే మిగిలిన సంస్థల నుంచీ గట్టి పోటీ కొనసాగుతోందని లై అన్నారు. అయితే జియోమీ వైయూ7 ముందస్తు బుక్కింగ్స్ నిపుణుల అంచనాలను మించి ఉండటంతో స్టాక్ మార్కెట్లలో స్టాక్ ధర భారీగా పెరిగిందని తేలింది.
Also Read :లాభాలతో ఎంట్రీ ఇచ్చిన ఐపీవో
తన స్మార్ట్ ఫోన్లతో చైనాలో ఆపిల్ సంస్థతో పోటీపడుతున్న జియోమీ సంస్థ ప్రస్తుతం ఈవీ కార్ల రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఉన్న టెస్లాతో పోటీకి నిలిచిందని లై అన్నారు. ఆయన సంస్థను చిప్ డిజైనింగ్ నుంచి ఏఐ గ్లాసెస్ వరకు అనేక రంగాల్లోకి విస్తరించారు. దీంతో ఐదేళ్లలోనే ప్రపంచ స్థాయిలో డివైజ్ లీడర్ అయ్యేందుకు 200 బిలియన్ యువాన్లను వెచ్చించారు. ప్రస్తుతం కారు సక్సెస్ కంపెనీ ఈవీ అమ్మకాలను 2025లో 209 శాతం పెంచొచ్చని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. టైనాసో ఎస్ యూవీ మోడళ్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో కంపెనీ మంచి విజయాన్ని చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.