ముగిసిన నారసింహుడి బ్రహ్మోత్సవాలు

ముగిసిన నారసింహుడి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు  ప్రధానార్చకులు నల్లంథీగల్‌‌ లక్ష్మీనర్సింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో 108 కలశాలను పేర్చి మంత్రోచ్ఛారణలు, పారాయణాలు, యాజ్ఞీకులు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా కలశాల్లోని మంత్రజలంతో స్వామి వారికి అభిషేకం చేశారు. సాయంత్రం నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి  డోలోత్సవం జరిపారు. అనంతరం అర్చక బృందం, వేదపండితులు, పారాయణికులు, రుత్వికులు, ఆలయ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులను సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌‌ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, గట్టు శ్రావణ్‌‌కుమార్‌‌, సూపరింటెండెంట్‌‌ దొమ్మాట సురేందర్‌‌రెడ్డి  పాల్గొన్నారు.