- టీజీ జెన్కో నిర్ణయం
- ఓ అండ్ ఎం పనుల కోసం ఏటా రూ.190 కోట్లు
- బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేటుపరం చేయొద్దు
- జెన్కో సీఎండీకి టీజీపీఈ జేఏసీ వినతి
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్–2 ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పనులను బీహెచ్ఈఎల్కు ఇవ్వాలని టీజీ జెన్కో నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ఏటా రూ.190 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు టీజీ జెన్కో యాజమాన్యం ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టింది. అయితే, జెన్కో నిర్ణయాన్ని విద్యుత్ శాఖ ఇంజినీర్ల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేట్సంస్థలకు ఓ అండ్ఎం పనులను అప్పగించే కుట్ర జరుగుతోందని, జెన్కో ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఇంజినీర్లతోనే నిర్వహణ చేపట్టాలని కోరుతోంది. ఈ మేరకు శుక్రవారం టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో టీజీ జెన్కో సీఎండీ హరీశ్ కు వినతిపత్రం అందజేశారు.
ఓ అండ్ ఎం కోసం ఏటా రూ.190 కోట్లు
నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. జెన్కో ఆధ్వర్యంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్లు నిర్మించడానికి రూ.29 వేల కోట్లు కేటాయించారు.
2017లో బీహెచ్ఈఎల్ కంపెనీతో వర్క్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. స్టేజ్–1లో ఒకటి, రెండు యూనిట్లు, స్టేజ్–2లో మూడు, నాలుగు, ఐదు యూనిట్లు పని చేస్తాయి. ఇప్పటికే స్టేజ్–2లో ఒక యూనిట్ పూర్తికాగా ట్రయల్ రన్ కంప్లీట్ చేసుకొని సింక్రనైజేషన్ పూర్తి చేశారు.
సీఓడీ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నెలాఖరులో నాలుగు, వచ్చే నెలలో ఐదో యూనిట్ పూర్తికానుంది. కాగా, స్టేజ్–2 ఓ అండ్ ఎం కూడా నిర్మాణ పనులు చేపట్టిన బీహెచ్ఈఎల్ కే అప్పగించాలని నిర్ణయించిన టీజీ జెన్కో సంస్థ.. ఇందుకోసం ఏడాదికి రూ.190 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్చేసుకోవాలని భావిస్తోంది.
ప్రైవేట్ పరం చేయొద్దు: టీజీపీఈ జేఏసీ
యాదాద్రి పవర్ స్టేషన్ స్టేజ్–2 ఓ అండ్ ఎం పనులను ప్రైవేట్పరం చేయొద్దని కోరుతూ టీజీపీఈ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం జెన్కో సీఎండీ హరీశ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కంపెనీకి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన టెక్నాలజీ, ఇంజినీరింగ్ వ్యవస్థ మాత్రమే ఉందని, నిర్వహణ అనుభవం లేదన్నారు.
బీహెచ్ఈఎల్ ముసుగులో ఓ ప్రైవేట్సంస్థ ఈ పనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఆ సంస్థ నిర్వాహకులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జెన్కోలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారు.
కేటీపీఎస్ స్టేజ్–7ను 48 నెలల్లో నిర్మించి, నడిపించిన అనుభవం వీరికి ఉంది. వైటీపీఎస్ స్టేజ్–2 ఓ అండ్ ఎం పనులను సైతం జెన్కో ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. ఈ పనులను బీహెచ్ఈఎల్ పేరుతో ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు భూపాల్ రెడ్డి, తాజుద్దీన్ బాబా, ఈశ్వర్ గౌడ్, నెహ్రూ, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సదానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
