యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం
  •    ఉచిత దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
  •     సండే ఆలయానికి రూ.52.72 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రద్దీ కారణంగా కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు కిక్కిరిశాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో.. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.

 మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, సువర్ణపుష్పార్చనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.52,72,699 ఆదాయం వచ్చింది. 

అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.19,54,900 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.70 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7.60 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,83,600 అదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.