
ఈ మధ్య జనాలకు సోషల్ మీడియాలో ఫేమస్ అవాలనే పిచ్చి పట్టుకుంది. రీల్స్ చేసుకుంటూ వ్యూస్ లైక్స్ కోసం పాకులాడుతున్నారు. వాటి కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎలాంటి సాహసాలైన చేస్తున్నారు. దీనికోసం ఓ ఘనుడు ఏకంగా విమానాన్నే కూల్చేశాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు ఓ యూట్యూబర్.
వ్యూస్.. లైకుల కోసం
ట్రెవర్ డేనియల్ జాకబ్ వాలెట్ అనే ఓ యూ ట్యూబర్ కూడా ఇలాంటి పనే చేశాడు. తన వీడియోకు లైకులు, వ్యూస్ కోసం దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘనుడు ఏకంగా విమానాన్ని కూల్చేశాడు. దీని మీద అధికారులు విచారణ చేపట్టినప్పుడు తనకేం తెలియదని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడంతోనే విమానం కూలిపోయిందని బుకాయించాడు. కానీ, అధికారులు వదలకుండా తమదైన స్టైల్లో ఆధారాలతో సహా అతడిని ప్రశ్నించడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు. ట్రెవొర్ జాకబ్ అనే యూట్యూబర్ అమెరికాలోని ఒలంపిక్స్ స్నోబోర్డు క్రీడాకారుడు. ఇతనికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ లో ఎక్కువగా స్కై డైవింగ్, ఏవియేషన్, స్నో బోర్డింగ్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తాడు. ఇవి చాలా ఆసక్తిగా ఉంటుండడంతో చాలామంది అతడి ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.
ప్రమాదం జరిగిన నెల రోజులకు..
2021 డిసెంబర్ 24వ తేదీన విమాన ప్రమాదం జరిగిన నెల రోజులకి అతని యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. దాని టైటిల్ ‘నేను విమానాన్ని కూల్చి వేశాను’ అని ఉంది. అందులో విమానం ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయని దీంతో తాను పారాచూట్ సహాయంతో బయటకు దూకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అతను బయటికి దూకే సమయంలో సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఉండడం కనిపించింది.
రెంట్ కు ఎయిర్ క్రాఫ్ట్
2021 నవంబర్ 24న మరణించిన తన స్నేహితుడి బూడిదను వెదజల్లాలని చెప్పి లోంపోక్ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకు తీసుకుని బయలుదేరాడు. లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అందులో ఉన్న ట్రెవొర్ పారాషూట్ సహాయంతో తప్పించుకున్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిని అందరూ ఇది ప్రమాదం అనే మొదట అనుకున్నారు.
విమానం కూలుతుండగా వీడియో చిత్రీకరణ
విమానం లాస్ పాడ్రేస్ నేషనల్ పార్క్ సమీపంలో కూలడాన్ని పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలుభాగాల్లో కెమెరాలు అమర్చి.. ఈ ప్రమాదాన్ని చిత్రీకరించాడు. వీడియో చివర్లో.. ‘ఈ ప్రమాదం నుంచి నేను సురక్షితంగా బయటపడినందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విమాన శిధిలాల వద్దకు చేరుకుని వాటిని కూడా వీడియో తీశాడు. ఆ తర్వాత ఓ హెలికాప్టర్లో తన మిత్రులతో కలిసి విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి వాటి శకలాలను వేరే ప్రదేశానికి మార్చాడు. వాటిని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మిగిలిన విమాన భాగాలను విమానాశ్రయం, మరి ఇతర ప్రదేశాల్లోని చెత్తలో పడేశాడు.
కావాలనే కూల్చాడు
ఈ విమాన ప్రమాదం మీద కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. దీని మీద అప్పటినుంచి దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ దర్యాప్తు బృందం 2022లో విమానాన్ని జాకబ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని నిర్ధారించింది. అతను లోంఫోక్ విమానాశ్రయానికి వచ్చేటప్పుడే భారీ పారా చ్యూట్తో వచ్చాడని గుర్తించింది. ఆ విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడగగా.. అది ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్ తెలిపాడు.అతని విమానానికి ముందే కెమెరాలు అమర్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. ఎట్టకేలకు ట్రెవొర్ ఫెడరల్ దర్యాప్తు బృందం ఎదుట తప్పును అంగీకరించాల్సి వచ్చింది. ఇక ఈ కేసులో ట్రెవొర్ కు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.