లంచం కోసమే పట్టా ఆపుతున్నరా?

లంచం కోసమే పట్టా ఆపుతున్నరా?

ప్రజావాణిలో ఆర్డీఓను నిలదీసిన యువ రైతు 

కరీంనగర్, వెలుగు: ‘లంచం కోసమే పట్టా ఆపుతున్నారా? డాక్యుమెంట్లు అన్నీ ఉండి.. ధరణిలో స్లాట్ బుక్ అయిన తరువాత కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు’ అని కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ ​కుమార్​ను ఓ యువరైతు నిలదీశాడు. సోమవారం కరీంనగర్ ​కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణికి చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన యువరైతు బండి ప్రశాంత్​ వచ్చాడు. తన తండ్రి రాజయ్యకి వారసత్వంగా వచ్చిన 20 గుంటల భూమికి పట్టా పాస్ బుక్ ఇవ్వడానికి ఆఫీసర్లు నానా తిప్పలు పెడుతున్నారని వాపోయాడు. ఆరేండ్లుగా తహసీల్దార్​ ఆఫీస్, కలెక్టరేట్ల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. విసిగిపోయిన తన తండ్రి రాలేకపోవడంతో తాను వచ్చినట్లు ప్రశాంత్​ చెప్పాడు. సదరు భూమికి సంబంధించి ధరణిలో వివరాలన్నీ తమవే చూపిస్తున్నాయని, గత నెల 31న రిజిష్ట్రేషన్ కోసం స్లాట్ కూడా బుక్ అయిందని తెలిపాడు. అయినప్పటికీ కలెక్టరేట్ నుంచి ఇంకా ఫైల్ రావాలి అంటూ ఆఫీసర్లు లేట్ చేస్తున్నారని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి పాస్​బుక్ ఇప్పించాలని ఆర్డీఓ ఆనంద్​ కుమార్​ను వేడుకున్నాడు.