
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘటన
తంగళ్లపల్లి, వెలుగు : ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన ఓ యువకుడు అప్పులపాలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్ పూర్తి చేసి కార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. వంశీ మూడేండ్లుగా ఆన్లైన్ బెట్టింగ్స్ పెడుతున్నాడు. ఇందుకోసం ఫ్రెండ్స్తో పాటు తెలిసిన వారి వద్ద సుమారు రూ. 10 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. డబ్బులన్నీ బెట్టింగ్లో పోవడం, ఇంట్లో విషయం తెలియడంతో యువకుడిని మందలించారు.
దీంతో మనస్తాపానికి గురైన వంశీ సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన సమీపంలోని రైతులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంమోహన్ తెలిపారు.