ఉద్యోగం రావట్లేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రావట్లేదని యువకుడి ఆత్మహత్య
  • ఉద్యోగం రావట్లేదని యువకుడి ఆత్మహత్య
  •  బీటెక్​ పూర్తి చేసినా జాబ్​లు వస్తలేవని మనస్తాపం
  • సిద్దిపేట జిల్లా విఠలాపురంలో విషాదం 

సిద్దిపేట రూరల్, వెలుగు : ఏడాదిగా సాఫ్ట్​వేర్​ఉద్యోగాల కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ఓ యువకుడు వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సుభాష్ గౌడ్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల చిన్న కొడుకు ఉపేందర్ రెడ్డి (25) హైదరాబాద్​లో బీటెక్ పూర్తి చేశాడు. 

ఏడాది నుంచి సాఫ్ట్​వేర్​ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అయినా, రాకపోవడంతో కలత చెందాడు. దీంతో మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోని తన మేనమామ తిరుపతిరెడ్డి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం బావి వద్దకు వెళ్లిన తిరుపతి రెడ్డి కొడుకు నరేందర్ బావిగడ్డపై ఉపేందర్ షర్టు, పర్సు, మొబైల్ చూసి తండ్రికి చెప్పాడు. 

ఆయన ఉపేందర్ రెడ్డి కుటుంబసభ్యులకు చెప్పగా వారు వచ్చి బావిలో వెతకగా ఉపేందర్ రెడ్డి మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.