బాబాయ్​లను చెరువులో తోసి చంపేసిండు

బాబాయ్​లను చెరువులో తోసి చంపేసిండు

బోధన్, వెలుగు: పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు బాబాయ్​లను చెరువులో తోసి చంపేశాడో యువకుడు. బోధన్​ఏసీపీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​జిల్లా బోధన్​లోని రాకాసిపేట్​కు చెందిన కెంబసత్తి పెద్ద వెంకటి, శివ(28), నర్సింహులు(32) అన్నదమ్ములు. వీళ్ల అన్న కొడుకు(పెద్దనాన్న మనవడు) కెంబసత్తి చిన్నవెంకటి. సోమవారం మధ్యాహ్నం చిన్న వెంకటి మందు తాగుదామని శివ, నర్సింహులను పిలిచాడు. బైక్​పై ఎక్కించుకుని బెల్లాల్​చెరువు కట్టపైకి తీసుకెళ్లాడు. మొదట కల్లు, తర్వాత మందు తాగించాడు. మద్యం మత్తులో ఉన్న శివ, నర్సింహులను చెరువులోకి నెట్టాడు. ఈత రాక ఇద్దరూ నీట మునిగి చనిపోయారు. తర్వాత చిన్న వెంకటి ఎప్పటిలాగే ఇంటికి  వచ్చి నిద్రపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు ఇంటికి రాకపోవడంతో పెద్ద వెంకటి బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తన తమ్ముళ్లు సోమవారం చిన్న వెంకటితో బైక్​పై వెళ్లారని పేర్కొన్నాడు. పోలీసులు చిన్న వెంకటిని విచారించగా చెరువులో తోసేసి తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. శివ 15 రోజుల క్రితం తనకు కొట్టాడని, అలాగే తన తండ్రిని 20 ఏండ్ల క్రితం నర్సింహులు, శివ వాళ్ల నాన్న చంపాడని అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. అనంతరం చెరువులో వారిద్దరి శవాలను గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు. చిన్న వెంకటిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ రామన్ తెలిపారు.