
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ సీఎన్జీ వర్కర్పై యువతి రెచ్చిపోయింది. అతడి గుండెల మీద రివాల్వర్ పెట్టి కాల్చి చంపుతానని బెదిరించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. హర్దోయ్కు చెందిన ఎహ్సాన్ఖాన్ తన కుటుంబంతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. వెహికల్లో ఫ్యూయెల్ నింపుకునేందుకు ఓ సీఎన్జీ స్టేషన్కు వెళ్లాడు.
అయితే, రీఫ్యూయెలింగ్ సమయంలో వాహనంలో ఉండడం సేఫ్ కాదని సీఎన్జీ బంక్ వర్కర్ రజనీశ్ కుమార్ చెప్పాడు. కారులో ఉన్న ఫ్యామిలీని కిందకు దిగాలని సూచించాడు. దీంతో ఎహ్సాన్ఖాన్ బయటకు వచ్చి రజనీశ్తో వాదనకు దిగాడు. మాటామాటా పెరగడంతో రజనీశ్ను ఎహ్ సాన్ తోసేయగా.. రజనీశ్ కూడా ఎహ్సాన్ను తోసేశాడు. ఇది చూసి ఎహ్సాన్ కూతురు ఆరిబా తీవ్ర ఆగ్రహానికి గురైంది.
కారులో నుంచి రివాల్వర్ తీసుకుని రజనీశ్పై బెదిరింపులకు దిగింది. రజనీశ్ గుండెలపై తుపాకీ పెట్టి.. ‘‘నీ శరీరం మొత్తం ఛిద్రమయ్యేదాకా బుల్లెట్లు దింపుతా’’ అని వార్నింగ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఆరిబా తల్లి కల్పించుకుని కూతురును లాక్కెళ్లింది. ఈ ఘటన అంతా బంక్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుడు రజనీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎహ్సాన్ కుటుంబంపై కేసు నమోదు చేశారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు.