మహబూబ్నగర్, వెలుగు : యువతలోని ఉత్సాహం, పట్టుదలే దేశాభివృద్ధికి పునాదులు అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చెప్పారు. ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని స్టేడియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీతో కలిసి క్రీడా జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఈ తరహా పోటీలు ఉపయోగపడుతాయన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, టీమ్ స్పిరిట్ పెంపొందించడానికి, ఓర్పు, క్రమశిక్షణను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి గ్రామంలోని బాలబాలికలు క్రీడల్లో రాణించే అవకాశం కల్పించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
యువత వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు క్రీడలే ఉత్తమ మార్గమన్నారు. అంతకు ముందు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్పోటీల్లో గెలిచిన వారికి గవర్నర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గొంగిడి త్రిషారెడ్డి, త్రిష పూజిత పాల్గొన్నారు.

