చిన్నారిపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు

చిన్నారిపై అత్యాచారం కేసులో యువకుడికి  20 ఏండ్ల జైలు
  •     శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు
     

ఎల్ బీనగర్, వెలుగు: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​లోని కిషన్ గంజ్ కు చెందిన తేజభూల ఖాన్(22) సిటీకి వచ్చి మీర్ పేటలో ఉంటున్నాడు. అతడు ఉంటున్న ఏరియాలో బిహార్ కు చెందిన ఓ కుటుంబం చికెన్ సెంటర్ రన్ చేస్తోంది. తేజభూల ఖాన్ ఆ షాప్ లో పనికి చేరాడు. దీంతో వారు ఉంటున్న ఇంటి పక్కనే అతడికి రూమ్ ఇచ్చారు. 

2022 మార్చి 29న చికెన్ సెంటర్ ఓనర్ కూతురి(6)పై తేజభూల ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఇచ్చిన కంప్లయింట్ మేరకు మీర్ పేట పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తేజభూల ఖాన్ ను దోషిగా తేల్చి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.20 వేల ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది.