నిర్మల్: చేపల వేటపై నిషేధం...గోదావరి నదితో పాటు ప్రాజెక్టులు, చెరువులకు వర్తింపు

నిర్మల్: చేపల వేటపై నిషేధం...గోదావరి నదితో పాటు ప్రాజెక్టులు, చెరువులకు వర్తింపు
  •     చేపల పునరుత్పత్తి టైం కావడంతో మత్స్యశాఖ ఆదేశాలు
  •     ఆగస్టు 31 వరకు అమలు అమల్లో ఉండనున్న ఉత్తర్వులు
  •     ఆదేశాలు పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామన్న ఆఫీసర్లు

నిర్మల్, వెలుగు : గోదావరి నదితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు నెలలు వర్షాల కారణంగా గోదావరి నదితో పాటు ప్రాజెక్టుల్లోని చేపలు గుడ్లు పెట్టి పొదిగే అవకాశం ఉంటుందని, మత్స్యకారులు చేపలు పడితే వాటి ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో స్థానిక ఆఫీసర్లు మత్స్య సహకార సంఘాలకు నోటీసులు జారీ చేశారు.  గోదావరి పరివాహక గ్రామాలతో పాటు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల పరిధిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ ప్రచారం కూడా చేపట్టారు. సెప్టెంబర్ నుంచి యథావిధిగా గోదావరి నదితో పాటు ప్రాజెక్టులు, చెరువుల్లోనూ చేపల వేట కొనసాగించవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు

మత్స్యశాఖ ఆదేశాలు ఉల్లంఘించి చేపల వేట కొనసాగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వేటకు ఉపయోగించే సామగ్రి, రవాణా వాహనాలను సీజ్ చేస్తామని, లైసెన్స్ లు రద్దు చేస్తామని ఆఫీసర్లు హెచ్చరించారు. అలాగే ఉత్తర్వులు కాదని వేటను కొనసాగించే వారికి 2026 _ 27కు సంబంధించిన లైసెన్స్ సైత్ జారీ చేయబోమని స్పష్టం చేశారు. మత్స్య సహకార సంఘాలన్నీ తమ పరిధిలోని మత్స్యకారులకు నిషేధంపై అవగాహన కల్పించాలని సూచించారు.

మత్స్యకారుల ఉపాధిపై ఎఫెక్ట్

చేపల వేటపై నిషేధం అమలులోకి రావడంతో మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నిర్మల్ జిల్లాలో 222 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. వీటిలో 13,129 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల్లో సభ్యత్వం లేని మరో ఐదు వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేటపైనే జీవిస్తున్నారు. వీరంతా జూలై, ఆగస్టు నెలల్లో ఫిష్ పాండ్లలో పెంచన చేపలనే కొనుగోలు చేసి అమ్ముకోవాల్సి ఉంటుంది.