తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ పంచకట్టుతో తలపై పట్టు వస్త్రాలు పెట్టుకుని మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేశారు. సీఎం జగన్ కు వేద పండితులు ఆశీర్వచనాలు ఇవ్వగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం టిటిడి ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు సీఎం జగన్. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇతర ప్రాంతాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది టీటీడీ.