వైఎస్ షర్మిల అరెస్ట్.. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన ఘటనలో 4 కేసులు

వైఎస్  షర్మిల అరెస్ట్.. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన ఘటనలో 4 కేసులు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల కారుతో ఢీకొట్టడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. షర్మిలను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు. 

దాడి చేయలేదు : వైఎస్ విజయమ్మ

వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె.. పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదన్నారు. తనను అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. షర్మిల సిట్ కార్యాలయానికి దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్తే సమస్యేంటీ అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారని విజయమ్మ ఆరోపించారు. ప్రశ్నించే గొంతును  ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. 

షర్మిలపై కేసులు 

అంతకుముందు వైఎస్ఆర్టీపీ అఫీసు ముందు ఆ  పార్టీ చీఫ్  షర్మిలను  పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు 4 సెక్షనల్ కింద కేసులు నమోదు చేశారు.  మహిళా కానిస్టేబుల్ తో  పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయి చేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులపై ఆగ్రహం

అరెస్ట్ తర్వాత షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కానీ.. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో.. విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు. అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో ఉన్న కుమార్తెను పరామర్శిస్తే తప్పేంటనీ పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తెలంగాణలో లేదా అంటూ మండిపడ్డారు.