కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు

కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు

కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆరోపించారు. దళిత సీఎం నుంచి దళిత బంధు హామీ వరకు అన్నీ మోసాలే అని విమర్శించారు. లక్షల కోట్ల అప్పు చేసినా.. టీఆర్ఎస్ పాలనలో బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. వడ్లు కొనే మొఖాలే అయితే వరి వేస్తే ఉరే అని ఎందుకు బెదిరించారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం రాజ్యమేలితే.. నిరుద్యోగులు చచ్చిపోవాలా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ప్రజా సమస్యలే లేవంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనతో పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్ విసిరారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడంలేదని తేలితే.. ముక్కు నేలకు రాసి ఇంటికెళ్తానని అన్నారు. ఒకవేళ ఉన్నట్లు తెలిస్తే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మార్చారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అక్రమంగా కోట్లు సంపాదించారంటున్న బీజేపీ.. ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. 

షర్మిల పాదయాత్రలో ఇవాళ వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా తాళ్లమడ గ్రామంలో వైఎస్ షర్మిల, విజయమ్మలు పైలాన్ ఆవిష్కరించారు.