హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కొందరు, అప్పుల బాధతో మరికొందరు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని షర్మిల విమర్శలకు దిగారు. ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడతాయ్ అంటూ కేసీఆర్ పై ఆమె ఫైర్ అయ్యారు. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడు కొంటారో తెలియక కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని.. కానీ యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ట్వీట్ చేశారు.
వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు..? 1/2 pic.twitter.com/byK0RedSe2
— YS Sharmila (@realyssharmila) December 3, 2021
కేసీఆర్ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతులు.. ఇవ్వాళ మరో ఇద్దరు అన్నదాతలు సూసైడ్ చేసుకున్నారని షర్మిల అన్నారు. ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను కోటీశ్వరులను చేశాం, కార్లలో తిరుగుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఫామ్ హౌస్ మత్తులో నుంచి బయటకు వస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు. రైతులు కోటీశ్వరులు కావడం కాదు.. ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారంటూ కేసీఆర్ పై సీరియస్ అయ్యారు. పంట కొనక ముందే కాటికి పంపుతున్నారని చెప్పారు.