- టీఆర్ఎస్ నేతలకు షర్మిల హెచ్చరిక
రాజన్నసిరిసిల్ల, వెలుగు: వైఎస్ రాజశేఖర్రెడ్డి మహానేత అని, ఆయన్ని కించపరిచేలా కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్కు లక్షల మంది అభిమానులున్నారని, వారంతా టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, పదిరలో కరోనా బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారు పడిన కష్టాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెట్టిన ఖర్చులను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదన్నారు.
పేదల ప్రాణాలకు విలువ లేదా?
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్కు కరోనా వస్తే యశోద హాస్పిటల్కు వెళ్లారని, పేద ప్రజలను మాత్రం సర్కార్ దవాఖానకు వెళ్లమంటున్నారని అన్నారు. పేదల ప్రాణాలంటే సీఎం కేసీఆర్కు విలువ లేదా అని ప్రశ్నించారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్లో కాకుండా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే బయటకు రావడం, రెండు కామెంట్లు చేసి మళ్లీ ఫాంహౌస్కు వెళ్లిపోవడం కేసీఆర్కు అలవాటుగా మారిందని షర్మిల విమర్శించారు. హైదరాబాద్కు తిరిగి వెళ్తున్న క్రమంలో గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికులు కరీంనగర్లో ఆమెను కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.