నిన్న(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో వైఎస్ షర్మిల చెప్పారో లేదో అది అమలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆమె అను చరులు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన ఆమె నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు.
తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. నిన్న ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడిన షర్మిల.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీనిపైనే ఆమె అనుచరులు ఇవాళ(శనివారం) స్పష్టత ఇచ్చారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర షర్మిల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
ఆమె దీక్ష చేసినప్పటికీ సర్కారు స్పందించకుంటే ఇతర జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచరులు చెప్పారు.