హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులకు సహకరిస్తామని వైఎస్ఆర్టీపీ వెల్లడించింది. ఈ మేరకు పార్టీ నామినేషన్ల కో ఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర సర్కారు కారణమవుతోందని ఆయన మండిపడ్డారు. బై పోల్లో పోటీ చేసి, ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల పట్ల మీకు బాధ్యత ఉందా?
మీ ఒక్క ఇంట్లోనే ఐదు ఉద్యోగాలు తీసుకున్న మీకు అసలు నిరుద్యోగుల పట్ల బాధ్యత ఉందా..? అని సీఎం కేసీఆర్ను వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్నెర్ర చేస్తే మీ ఉద్యోగాలు పోతయి.. జాగ్రత్త అని మంగళవారం ట్విట్టర్లో హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. “తండ్రి 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తనంటడు.. అల్లుడు హరీశ్ 75 వేల ఉద్యోగాల భర్తీ అంటడు.. కొడుకు కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటండు..”ఇలా ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతూ గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.