ప్రజా పాలనను పక్కన పెట్టిన కేసీఆర్, మోడీని సాగనంపాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 107వ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే... కేసీఆర్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ఫైర్ అయ్యారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్.. ఎన్నికల సమయంలో మళ్లీ వస్తాడు. మనకు మాయమాటలు చెప్తాడు. ఎస్టీ బంధు, బీసీ బంధు అంటాడు. గాడిదకు రంగుపూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు.మళ్లీ కేసీఆర్ ను నమ్మితే ఐదేండ్లు నరకమే.#PrajaPrasthanam #Day107 #Suryapet pic.twitter.com/vuNXO5eYHk
— YS Sharmila (@realyssharmila) June 27, 2022
ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. ప్రజల అవసరాలను ఏమాత్రం పట్టించుకోనీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికే తాను పార్టీ పెట్టినట్లు షర్మిల ప్రకటించారు. ఉద్యోగాల పేరుతో మోడీ దేశ యువతను మోసం చేశారని, రాష్ట్రానికి కనీసం పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఆదరిస్తే... వైఎస్ఆర్ పాలన తెస్తానని షర్మిల హామీ ఇచ్చారు.