
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన భార్య గీత నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ను తెలియజేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణం అని భావిస్తాను. అందుకే నా మొదటి సినిమా నుంచి మర్చిపోలేని పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఆయన కథ విని, ఒక పెద్దన్నయ్యలా సలహాలు, సూచనలు ఇచ్చారు. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ మా సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఇక ‘కంచె’ సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రాతో పనిచేయాలి అనుకున్నా. ఈ చిత్రంతో అది కుదరడం ఆనందంగా ఉంది. తెలుగమ్మాయి వీణ రావును హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. అలాగే మరికొందరిని పరిచయం చేయబోతున్నాం’ అని చెప్పారు. డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, నిర్మాత గీత పాల్గొన్నారు.