రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓటింగ్ముగిసింది. మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 77.81 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 88.40 శాతం, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 68.53 శాతం జరిగింది. మొత్తంగా మూడు దశలూ కలిపి 77.41 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిపోయింది. ఈ నెల 6న మొదటి దశ, ఈ నెల 10న రెండో దశ, మంగళవారం మూడో దశ ఎన్నికలు జరగ్గా.. అక్కడఅక్కడా స్వల్ప ఘర్షణలు, వివాదాలు తప్పితే దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 27న కౌంటింగ్ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
తగ్గిన పోలింగ్ శాతం
జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. ఆ ఎన్నికల్లో చాలా చోట్ల 90శాతానికిపైగా ఓటింగ్ జరిగినా.. పరిషత్ ఎన్నికల్లో 80శాతంలోపే నమోదైంది. సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం కావడంతో అప్పట్లో ఎక్కువ పోలింగ్ జరిగిందని.. పరిషత్ ఎన్నికలపై ఓటర్లలో పెద్దగా ఆసక్తి లేకపోవడంతోపాటు మండుతున్న ఎండలు కూడా పోలింగ్ తగ్గానికి కారణమయ్యాయని అంటున్నారు. మూడు
4.విడతల్లోనూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య పోలింగ్ కేంద్రాలు బోసిపోవడం గమనార్హం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మాత్రం అన్ని దశల్లోనూ 80 శాతంపైగానే పోలింగ్ జరిగింది.
మూడో దశలో పలుచోట్ల అంతరాయం
మూడో దశ ఎలక్షన్లలో భాగంగా మంగళవారం పలుచోట్ల పోలింగ్కు అంతరాయం కలిగింది. మంచిర్యాల జిల్లా పెద్దంపేట ఎంపీటీసీ స్థానంలోని బుద్ధపల్లిలో 4వ నంబర్ పోలింగ్ బూత్లో గందరగోళం నెలకొంది. ఇక్కడ పెద్దంపేట ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్కు బదులు.. రాపల్లి ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ వచ్చింది. తొలుత అధికార యంత్రాంగం దీనిని గుర్తించలేదు. గుర్తించేసరికే 42 మంది ఆ తప్పుడు బ్యాలెట్ పేపర్పైనే ఓటేశారు. పెద్దంపేట ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి బ్యాలెట్ పేపరులో తప్పును గుర్తించారు. దీంతో రెండు గంటలకుపైగా ఓటింగ్ నిలిచిపోయింది. అధికారుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల సిబ్బంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో మాట్లాడి పోలింగ్ను పునరుద్ధరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అప్పటికే ఓటేసిన 42 మందితో మళ్లీ ఓటేయించారు. ఇక శంషాబాద్ లో టీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లోకి ఇరు పార్టీల అభ్యర్థులు సెల్ ఫోన్ తీసుకొచ్చారు. పోలింగ్ సిబ్బంది అభ్యంతరం చెప్పటం, తర్వాత ఇద్దరు అభ్యర్థుల మధ్య మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది.
జిల్లాలవారీగా
మొత్తం పోలింగ్
జిల్లా పోలింగ్ శాతం
ఆదిలాబాద్ 77.32
ఆసిఫాబాద్ 77.47
మంచిర్యాల 73.20
నిర్మల్ 77.17
జగిత్యాల 73.52
కరీంనగర్ 75.18
పెద్దపల్లి 77.48
సిరిసిల్ల 74.31
కొత్తగూడెం 76.12
ఖమ్మం 84.07
గద్వాల 77.80
మహబూబ్ నగర్ 71.08
నాగర్ కర్నూల్ 74.01
వనపర్తి 73.64
నారాయణపేట 71.21
మెదక్ 78.50
సంగారెడ్డి 79.06
సిద్దిపేట 77.15
కామారెడ్డి 73.70
నిజామాబాద్ 73.54
నల్గొండ 83.62
సూర్యాపేట 84.88
యాదాద్రి 86.64
మేడ్చల్ 75.48
రంగారెడ్డి 81.88
వికారాబాద్ 71.09
జనగాం 77.09
భూపాలపల్లి 72.18
మహబూబాబాద్ 77.87
వరంగల్ రూరల్ 79.78
వరంగల్ అర్బన్ 76.87
ములుగు 73.03
మొత్తం 77.41