హిందీ భాషపై తమిళనాడులో మరోసారి వివాదం మొదలైంది. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI ) ఆదేశాల మేరకు ఈ వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందినీ డెయిరీకి నోటీసులు జారీ చేసింది. తమిళనాడుతో పాటూ కర్నాటక, కేరళలోని కొన్ని డెయిరీలకు ఈ నోటీసులు వెళ్లాయి. పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్’ అనే ఆంగ్ల పదానికి బదులు దహీ అనే హిందీ పదం వాడాలనేది ఈ ఆదేశాల సారాంశం.
ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆదేశాలు అమలయితే భాషా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదంతా కేంద్రం చేస్తోన్న కుట్రగా అభివర్ణించిన ఆయన.. హిందీని ఇలా రుద్దాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని సహకార సంఘాలు ఉత్పత్తి చేసే పెరుగు సాచెట్లలో “ ధహీ ” వాడకంపై FSSAI విడుదల చేసిన నోటిఫికేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.