ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు మహిళలపై జరిగిన జాత్యహంకార వేధింపుల ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని మాల్వియా నగర్లో నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు మహిళలపై పొరుగు ఇంటి వారు దారుణంగా ప్రవర్తించారు. కేవలం ప్రాంతం, జాతి పేరుతో వారిని కించపరుస్తూ మాట్లాడటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.
ఏం జరిగిందంటే... ఫిబ్రవరి 20న ఈ మహిళలు వాళ్ళు ఉండే ఫ్లాట్లో ఏసీ (AC) ఫిట్ చేస్తున్న సమయంలో, గోడ డ్రిల్లింగ్ వల్ల కొంత దుమ్ము కింద ఉన్న పొరుగు ఇంటి బాల్కనీలో పడింది. ఈ చిన్న కారణంతో మొదలైన గొడవలో పొరుగు ఇంట్లో ఉండే దంపతులు హర్ష్ సింగ్, రూబీ ఆ మహిళలను "మోమో" అని పిలుస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ఆ మహిళలను వేశ్యలు అని, మసాజ్ పార్లర్ నడుపుతున్నారని అసభ్యంగా కించపరుస్తున్న మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఒక పెద్ద రాజకీయ నాయకుడి కోడలినని చెప్పుకుంటూ ఆమె ఆ మహిళలను భయపెట్టే ప్రయత్నం చేసింది.
అయితే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హర్ష్ సింగ్, రూబీ జైన్లపై FIR నమోదు చేశారు. మహిళలను అవమానించడం, బెదిరింపులు, జాతి వివక్ష చూపడం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే, ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై ఇలాంటి వివక్ష చూపడం ఆపాలని కోరారు. మమ్మల్ని అవమానించినందుకు నిందితులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
