
- దేశంలో పాముకాటుతో .. ఏటా 50 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో పాముకాటు మరణాలు ఏటా భారీగా పెరుగుతున్నాయని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ లోక్ సభ దృష్టికి తెచ్చారు. పాము కాటుతో ఏటా 50 వేల మంది చనిపోతున్నారని, పాముకాటు మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఏటా దేశంలో 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని, అందులో 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
మిగిలిన వారు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనో, పాము కాటు తీవ్రత తక్కువగా ఉండడం వల్లనో బతికిపోతున్నారని వివరించారు. చాలా సందర్భాల్లో కాటు వేసిన వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడొచ్చని, అలాంటి మెకానిజం డెవలప్ చేయాలన్నారు. వాతావరణ మార్పులు కూడా పాము కాట్లపై ప్రభావం చూపుతున్నాయన్నారు. పేదరికం, ప్రకృతి వైపరీత్యాలతో బిహార్ ఇబ్బందులు పడుతోందని ఎంపీ తెలిపారు.
ఈ ఏడాదిలో185 లక్షల కోట్లకు కేంద్రం అప్పు..
విదేశీ రుణాలతో కలుపుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అప్పు రూ.185 లక్షల కోట్లకు చేరనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. ఇది దేశ జీడీపీలో 56.8%కి సమానమని పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లని, జీడీపీలో ఇది 58.2 శాతమన్నారు. లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి సోమవారం లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లు దాటిందని పేర్కొన్నారు.