టెర్రరిస్టుగా మారిన రిటైర్డ్ సైనికుడు అరెస్ట్

టెర్రరిస్టుగా మారిన రిటైర్డ్ సైనికుడు అరెస్ట్

న్యూఢిల్లీ: ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత టెర్రరిస్టుగా మారిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని లష్కరే తాయిబాకు చెందిన రియాజ్ అహ్మద్ గా గుర్తించారు. రియాజ్, అతడి సహచరులు జమ్మూకాశ్మీర్‌‌ కుప్వారా జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారు. దీనికోసం వారు పాక్‌‌లోని టెర్రరిస్టు హ్యాండ్లర్‌‌ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తెప్పించేందుకు కుట్ర పన్నారు. వీటితో దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్రను భద్రతా బలగాలు ఇటీవలే భగ్నం చేశాయి. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. రియాజ్ మాత్రం కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు అతడు వస్తున్నాడని జమ్మూకాశ్మీర్ లోని ఏజెన్సీల నుంచి పోలీసులకు సమాచారమందింది. ఈ క్రమంలో అప్రమత్తమయిన పోలీసులు రైల్వే స్టేషన్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.