జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు

జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు

మేడ్చల్ జిల్లా: జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఈఈ కృష్ణ, అతడి సహాయకుడు భరత్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ చేసిన దాదాపు రూ.30 లక్షల పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు డీఈఈ కృష్ణ  రూ.1.20 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బుల ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ బతిమాలుకున్నాడు.  ఈ క్రమంలో ముందుగా రూ.20 వేలు చెల్లించారు. మరికొంత డబ్బు అడిగితే  గురువారం డీఈఈ కృష్ణకు రూ.30 వేలు, ఆయన సహాయకుడు భరత్ కు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలోనే లంచం డబ్బు తీసుకున్న వీరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.