
- రూ.6.48 లక్షల విలువైన మందులు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిషేధిత అల్ర్ఫాజోలం ట్యాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.6 లక్షల 48 వేల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి గురువారం నగరంలోని ఎక్సైజ్ భవనంలో వెల్లడించారు.
హైదరాబాద్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, పొద్దుటూరుకు చెందిన కేతుపల్లి మునిశేఖర్ ఉత్తరప్రదేశ్ నుంచి ట్యాబ్లెట్లను తెప్పించారు. రూ.4 విలువైన ఒక ట్యాబ్లెట్ ను రూ.10 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారు. కొరియర్ ద్వారా వచ్చిన ఈ ట్యాబ్లెట్లను నిందితులు హయత్నగర్లోని ఆటోనగర్లో రిసీవ్ చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడి వెళ్లి నిందితులను పట్టుకుని మందులను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వల రెడ్డి, రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం సుభాష్ చంద్ర, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనిల్ రెడ్డి, గోవింద సింగర్, ఎస్టీఎఫ్ అధికారులు సీహెచ్.నాగరాజు, రవి శ్రీనివాస్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.