యూపీ నుంచి అల్ఫ్రాజోలం ట్యాబ్లెట్లు ...హైదరాబాద్​లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్​

యూపీ నుంచి అల్ఫ్రాజోలం ట్యాబ్లెట్లు ...హైదరాబాద్​లో విక్రయిస్తున్న  ఇద్దరి అరెస్ట్​
  • రూ.6.48 లక్షల విలువైన మందులు స్వాధీనం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నిషేధిత అల్ర్ఫాజోలం ట్యాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.6 లక్షల 48 వేల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్​ శాఖ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి గురువారం నగరంలోని ఎక్సైజ్​ భవనంలో వెల్లడించారు. 

హైదరాబాద్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్,  పొద్దుటూరుకు చెందిన కేతుపల్లి మునిశేఖర్  ఉత్తరప్రదేశ్​ నుంచి ట్యాబ్లెట్లను తెప్పించారు. రూ.4 విలువైన ఒక ట్యాబ్లెట్​ ను రూ.10 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారు. కొరియర్​ ద్వారా వచ్చిన ఈ ట్యాబ్లెట్లను నిందితులు హయత్​నగర్​లోని ఆటోనగర్​లో రిసీవ్​ చేసుకున్నట్లు ఎక్సైజ్​ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడి వెళ్లి నిందితులను పట్టుకుని మందులను స్వాధీనం చేసుకున్నారు. 

రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, సరూర్​ నగర్​ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ ఉజ్వల రెడ్డి, రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్, రంగారెడ్డి ఎన్​ఫోర్స్​మెంట్​ టీం సుభాష్​ చంద్ర,  డ్రగ్ కంట్రోల్  అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, డ్రగ్ ఇన్​స్పెక్టర్లు అనిల్ రెడ్డి, గోవింద సింగర్,  ఎస్టీఎఫ్  అధికారులు సీహెచ్.నాగరాజు, రవి శ్రీనివాస్, సందీప్ రెడ్డి  పాల్గొన్నారు.