
ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె.. అనే సామెత గుర్తుండే ఉంటుంది.. ఈ అక్కాచెల్లెళ్ల అత్యాశకు అది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎప్పటికైనా వారసులకే చెందుతాయి. కానీ అత్యాశ.. అహంకారం.. తొందరపాటుతో నోటి వరకు రావాల్సిన ముద్ద నేల పాలు అయినట్లు.. వీళ్ల ఆస్తి అంతా దేవుని పాలయ్యింది. తండ్రిని ఒక డబ్బు సంపాదించే మెషీన్ గా చూస్తూ.. ఎప్పుడు ఆస్తి లాగేసుకుని వాళ్లను రోడ్డు మీద పడేద్దామా.. అని చూసిన ఇద్దరు కూతుళ్లకు తగిన శాస్తి చెప్పాడు ఆ తండ్రి. ఆస్తి పత్రాలన్నీ తీసుకెళ్లి దేవుని హుండీలో వేశాడు. తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తండ్రీ కూతుళ్ల పంచాయతీ ఏంటో ఒక సారి తెలుసుకుందాం.
తమిళనాడులోని కన్నమంగళం సమీపంలో పటవేడు గ్రామానికి చెందిన విజయన్ (65) రిటైర్డ్ ఆర్మీ సోల్జర్. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. దేశం కోసం సైనికుడిగా పనిచేసి వచ్చిన జీతం నుంచే కూతుళ్ల చదువు, పెళ్లి మొదలైన అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. అదే విధంగా నెలకు ఎంతో కొంత సేవింగ్ చేస్తూ .. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పీఎఫ్ తో రెండు ఇండ్లు సంపాదించాడు. అదే విధంగా కొంత ఆస్తిని కూడబెట్టాడు.
తండ్రిని మనీ మెషిన్లా చూసిన కూతుళ్లు:
ఇద్దరే కూతుళ్లు. కొడుకులు లేరు. అంటే ఆయన ఆస్తి ఎన్నాళ్లకైనా వాళ్లకే చెందుతుంది. కానీ ఇక్కడే వచ్చింది తండ్రీ కూతుళ్ల మధ్య అసలు వివాదం. పెద్ద కూతురు సుబ్బలక్ష్మీ డాక్టర్ గా సెటిల్ అయ్యింది. చిన్న కూతురు రాజలక్ష్మీ టీచర్ గా గౌరవప్రదమైన వృత్తిలో ఉంది. ఇద్దరూ వెల్ సెటిల్డ్. కానీ వాళ్ల ఆశ తండ్రి ఆస్తి మీద పడింది. వాళ్ల బాగోగుల గురించి ఆలోచించడం కంటే.. ఆస్తి ఎప్పుడు తమ పేరున రాసుకుందామా అనే ప్రయత్మం చేసేవారంట. దానికి తోడు ఈ ఇల్లు నాది అంటే నాదంటూ.. నువ్వే ఇంకో ఇల్లు తీసుకో.. అది నాది.. ఇది నీది అంటూ ఎవరికి నచ్చింది వాళ్లు సెలెక్ట్ చేసుకుని తగవులు పడుతుండటం ఆ తండ్రికి చికాకు తెప్పించింది.
ఇళ్లను ఎప్పుడు మా పేర రాస్తున్నావ్ నాన్న.. ఆస్తులు ఎప్పుడు పంచుతున్నారు అమ్మా.. అంటూ ఎప్పుడూ ఒకటే గోల. కొన్ని సార్లు గొడవలు పెట్టుకునేవారంట. తండ్రీ కూతుళ్ల మధ్య మాటలు కూడా లేని పరిస్థితికి వచ్చిందట సిచవేషన్. ఈ పరిస్థితుల్లో సంపాదించింది ఎప్పటికైనా వీళ్లకే కదా.. అయినా తమ మంచీ చెడును ఆలోచించడకుండా.. ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారని ఆ తండ్రి విజయన్ చాలా ఆవేదనకు గురయ్యాడు. ఏ ఆస్తి చూసుకుని వీళ్లు ఇంత టార్చర్ పెడుతున్నారో.. అదే ఆస్తిని దేవునికి దానం చేస్తే ఓ పీడ విరగడ అవుతుందని నిర్ణయించుకున్నాడు.
2025, మే 2 తేదీన రేణుకాంబ గుడికి వెళ్లి.. సుమారు రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలన్నీ హుండీలో వేశాడు విజయన్. రెండు ఇండ్లలో గుడికి సమీపంలో ఉన్న రూ.3 కోట్ల విలువైన రెండు ఫ్లోర్ల ఇంటి డాక్యుమెంట్స్ తో పాటు మరో 1500 స్కేర్ ఫీట్ ఉన్న రూ. కోటి విలువైన ఇంటి పత్రాలు కూడా హుండీలో వేసేశాడు.
‘‘నేను దేశం కోసం సేవ చేశాను. నా పిల్లల కోసం కష్టపడి ఆస్తులు సంపాదించాను. అవి వాళ్లకు ఇవ్వాలని కలలు కన్నాను. కానీ వాళ్లు నన్ను మనీ మెషీన్ లా. ఎప్పుడు లాగేసుకుందామా అని చూశారు.. నా మంచి చెడుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే అమ్మవారికి ఆ ఆస్తులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని విజయన్ చెప్పారు.
గుడి ముందు యుద్ధ వాతావరణం:
విజయన్ ఆస్తులను గుడికి విరాళంగా ఇవ్వటం గురించి తెలుసుకుని ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు ఆలయం దగ్గరికి వచ్చి ఆస్తి పత్రాలు కావాలని అడిగారు. ఎప్పుడైతే హుండీలో వేశారో అప్పుడే అవి ఆలయ ఆస్తులయ్యాయి.. ఇచ్చేది కుదరదని గుడి ధర్మకర్తలు చెప్పడంతో పెద్ద గొడవే జరిగింది. అవి తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు.. ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. విజయన్ భార్య కస్తూరి.. తమ ఆస్తులు తమకు ఇవ్వాలని.. తమ అంగీకారం లేకుండా ఇచ్చినవి గుడికి చెందవని కన్నీరు పెట్టుకుంది.
ఇక పెద్ద కూతురు సుబ్బలక్ష్మీ ఆలయ పూజారులు, ధర్మకర్తలతో పెద్ద యుద్ధమే చేసింది. అయితే టీచర్ అయిన చిన్న కూతరు రాజలక్ష్మీ.. ఏ చట్టం ప్రకారం తమ ఆస్తులు గుడికి చెందుతాయో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై జాయింట్ కమిషనర్ సిలాంబరాసన్ కు కంప్లైంట్ ఇచ్చారు. ‘‘మీ తండ్రి గుడికి డొనేట్ చేశాడు. విరాళం పూర్తయ్యింది. ఇకనుంచి ఆ ఆస్తులు గుడికే చెందుతాయి.. ధార్మిక కార్యక్రమాల కోసం ఆ ఆస్తులను వినియోగిస్తారు’’ అని చెప్పడంతో కంగుతిన్నారు. అయితే దీనిపై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోనుందోననే డైలమా తమిళనాడు వ్యాప్తంగా నెలకొంది.