- అంత్యక్రియల రశీదు ఇవ్వని స్మశాన వాటిక నిర్వాహకులు
- కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే నో యూజ్.. యాప్ లో ట్రై చేసినా సేమ్ సీన్
- మల్కాజ్ గిరి సర్కిల్ ఆఫీసుకు వెళ్లమంటూ సలహా
- చివరకు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారం
హైదరాబాద్: సైన్యంలో కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఆయన తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ అధికారులతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. స్మశాన వాటిక వారు రశీదు పుస్తకాల్లేవని ఉత్త చేతులతో తిప్పి పంపారు. ఊహించని సమాధానంతో షాక్ కు గురై వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. మరో మార్గం లేదా అని ఆరా తీయగా యాప్ లో ట్రై చేయమంటే అలా చేసినా ఉపయోగం లేకపోయింది. దీనిపై అధికారులను ప్రశ్నించగా మల్కాజ్ గిరి సర్కిల్ ఆఫీసుకు వెళ్లమంటూ మరో ఉచిత సలహాతో కల్నల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఓ వైపు జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ అత్యవసరంగా వచ్చిన తాను తన తండ్రి డెత్ సర్టిఫికెట్ లేకుండా వెళితే సైన్యంలో ఉన్నతాధికారుల ముందు అబద్దం చెప్పినట్లు తలొంచుకోవాల్సిన పరిస్థితి. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ సైనిక్ పురిలో నివాసం ఉంటున్న సత్యబ్రత దాస్ గుప్తా(84) సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు జాయ్ దాస్ గుప్తా ఆర్మీలో కల్నల్ హోదాలో ఒక బెటాలియన్ కు కమాండింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి ఈనెల 9వ తేదీన చనిపోవడంతో తండ్రి మరణవార్త విని వెంటనే సెలవు పెట్టి నగరానికి చేరుకున్నారు. నేరేడ్ మెట్ శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు.
కర్మకాండ కార్యక్రమాల అనంతరం తిరిగి విధుల్లో చేరాల్సి ఉండటంతో తండ్రి డెత్ సర్టి ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీన నేరేడె మెట్ శ్మశానవాటికకు వెళ్లారు. శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు సంబంధించిన రశీదు ఇవ్వలేదు. కొన్ని రోజులుగా మరణాలు పెరగడంతో రశీదు పుస్తకాలు అయిపోయాయని, జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కొత్త పుస్తకాలు ఇంతవరకు రాలేదని తెలిపారు. దీంతో విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కల్నల్ జాయ్ జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించగా యాప్లో రిక్వెస్ట్ పెట్టమన్నారు. అయితే ఎంత ప్రయత్నించినా యాప్ ద్వారా ప్రయోజనం లేకుండా పోయింది. విసిగిపోయి కాల్సెంటర్కు ఫోన్ చేసినా సమస్య మొదటికే వచ్చింది. కాల్ సెంటర్ వారు జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లి కలవాల్సిందిగా సలహా ఇచ్చారు.
పద్మవ్యూహంలా ఎక్కడెక్కడో తిప్పుతుండడంతో విసిగిపోయారు. ఈయన పరిస్థితిని తెలుసుకున్న ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న ఒకరు కల్నల్ దాస్గుప్తా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్కు ఈ నెల 13వ తేదీన ట్వీట్ చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి నిన్న సోమవారం హడావుడిగా డెత్ సర్టిఫికెట్ జారీ చేయించారు. ఇలాంటి పరిస్థితి ఇకముందు ఎవరికీ రాకుండా పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవిందకుమార్కు సూచనలిచ్చారు.