ముందు నన్ను అరెస్ట్ చేయండి.. డీజీపీకి రాజాసింగ్ సవాల్

ముందు నన్ను అరెస్ట్ చేయండి.. డీజీపీకి రాజాసింగ్ సవాల్
  • హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: రాజాసింగ్

హైదరాబాద్: గో సంరక్షణకు పాటుపడే వారిపైనే పోలీసులు కేసుపెడుతన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి సవాల్ విసిరారు. కబేళాకు వెళ్లే ఆవులను అడ్డుకోవడానికి నేనే స్వయంగా వెళ్తున్నా.. డీజీపీ గారు ముందు నన్ను అరెస్టు చేయాలన్నారు. కబేళాకు తరలిస్తున్న ఆవులను ఆపి పోలీసు స్టేషన్లకు తీసుకొచ్చే వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం స్లీపర్ సెల్ లకు , ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. 
తెలంగాణ పోలీసులకు అసలు టెన్షన్ లేదు,  భద్రతను గాలికి వదిలి బక్రీద్ ను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీస్ అధికారులు ఆవులు కోతకు పోకుండా అడ్డుకున్న వారిని కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కోతకు వెళ్లే ఆవులను ఆపి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చేవారి పైనే ఎదురు కేసులు నమోదు చేయాలని చూస్తున్నారన్నారు. 
తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టు కోర్ట్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. నేనే స్వయంగా కోతకు వెళ్లే ఆవులను కాపాడుకోవడానికి బయటకు వెళ్తున్నా.. నా జీవితం గో రక్షణ కోసమే.. గోవులను కాపాడుకుంటా.. డిజిపి గారు ముందుగా నన్ను అరెస్టు చేయండని సవాల్ చేశారు రాజాసింగ్.