
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం అమలు చేయనున్న హ్యామ్ ప్రాజెక్టుపై పునరాలోచించాలని సీఎం రేవంత్ రెడ్డిని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి కోరారు. బుధవారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి బీఏఐ తరఫున ఆయన లేఖ రాశారు.
రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మతులకు 120కి పైగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ప్లాంట్ రూ.10 కోట్ల ఖర్చుతో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ప్లాంటులో సుమారు 300 మందికి కాంట్రాక్టర్లు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. రోడ్ల విస్తరణ కంటే, ప్రస్తుత రోడ్లను
పునరుద్ధరించడమే సమంజసమని, నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని రోడ్లను రెన్యూవల్ చేసి, ఏడేండ్లు రోడ్డు మెయింటనెన్స్ ను కాంట్రాక్టర్కు అప్పగిస్తే, కాంట్రాక్టర్లు క్వాలిటీ పనులు చేయగలుగుతారన్నారు. రెగ్యులర్ మోడల్తోనే ప్రభుత్వం హ్యామ్ మోడల్లో చూపిన 40% ఖర్చుతో పనులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.