- ఇయ్యాల్టి నుంచే బండి సంజయ్ ప్రజా సంగ్రామం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు ముందు 300 బుల్లెట్ బైకులతో ర్యాలీ నిర్వహించటానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్లాన్ చేశారు. పాదయాత్ర ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేషనల్ సెక్రటరీలు అరుణ్ సింగ్, సత్యకుమార్, ఎంపీ మునుస్వామి, బీజేపీ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ఎంపీలు అర్వింద్, బాపూరావు, డీకే అరుణ, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, విజయ శాంతి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందనరావు, మురళీధర్ రావు, పొంగులేటి తదితరులు పాల్గొననున్నారు.
ఫస్ట్ డే షెడ్యూల్ ఇదీ..
సంజయ్ యాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి మదీనా, అఫ్జల్గంజ్, బేగంబజార్, మొజంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం చేరుకోనుంది. మొదటిరోజు 10 కిలోమీటర్లు సాగనుంది. రాత్రి మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో సంజయ్ బస చేస్తారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వెయ్యి మంది సంగ్రామ సేన కార్యకర్తలు రిజిస్టర్ చేసుకోగా, పాదయాత్ర కమిటీ 300 మందికే అనుమతి ఇచ్చింది.
పోలీసులు, ఆఫీసర్ల అత్యుత్సాహం
పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారని, పోలీసులు సైతం పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.