బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వంట మనిషి ఇంట్లో ఎం చేస్తుందో తెలుసుకొని ఆమెను పనిలోంచి తీసేశాడు. పంకజ్ తన్వర్ అనే ఈ టెక్కీ, అతని ఇంట్లో ఫ్రిడ్జ్ నుండి పండ్లు మాయమవుతుండటం గమనించి, వంటగదిలో AI రూమ్మేట్ అనే ఒక స్మార్ట్ టెక్నాలజీ సిస్టం కెమెరా ఏర్పాటు చేశారు.
ఏం జరిగిందంటే... పంకజ్ ఇంట్లో పని చేసే వంటామె.. ఫ్రిడ్జ్ నుండి ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటి పండ్లను దొంగిలిస్తోందని ఆయనకు అనుమానం వచ్చింది. ఇది తెలుసుకోవడానికి ఆయన ఒక AI కెమెరాను వంటగదిలో పెట్టారు. ఆ AI కెమెరా వంటామె చేసే ప్రతి పనిని గమనించి చెప్పేస్తుంది.
AI పంపిన షాకింగ్ వివరాలు:
వంటామె రాగానే ముందుగా పండ్ల దొంగతనం చేసేందుకు ఫ్రిజ్ ఓపెన్ చేసి రెండు ఆపిల్స్ తీసి తన బ్యాగులో పెట్టుకుందని... ఆమె వంట చేసేటప్పుడు డస్ట్బిన్ మూతను తాకిన చేతులతోనే, కడుక్కోకుండానే చపాతీలు చేసిందని.. స్టవ్ వెనుక ఉన్న మురికిని ఆమె అస్సలు తుడవలేదని, కేవలం పైన పైన క్లీన్ చేసిందని ఈ AI పంకజ్కి మెసేజ్ పంపింది.
ఈ విషయాన్ని పంకజ్ సోషల్ మీడియా (X)లో షేర్ చేయడంతో పెద్ద చర్చ మొదలైంది. నెలకు రూ. 5 వేలు జీతం కూడా ఇవ్వని వంటామె మీద ఇలాంటి నిఘా పెట్టడం అవసరమా ? అని కొందరు ఆయన్ని విమర్శించగా.... దానికి సమాధానంగా పంకజ్.. నేను ఆమెను ముందే రెండుసార్లు హెచ్చరించాను. అయినా ఆమె వినకుండా దొంగతనం చేస్తూనే ఉంది. పండ్లు కావాలంటే అడిగి తీసుకోవచ్చు, కానీ దొంగతనం చేయడం పద్ధతి కాదు అని క్లారిటీ ఇచ్చారు.
ఈ AI ఎలా పనిచేస్తుంది:
ఇది ఒక సీసీటీవీ కెమెరాలాగే ఉంటుంది. లోపల ఉన్న సాఫ్ట్వేర్ (AI Model) మనుషులు చేసే పనులను మాత్రమే గమనిస్తూ ఉంటుంది. వంటామె చెప్పిన పని కాకుండా ఇంకేదైన చేసిన, ఏ వస్తువైన తీసుకున్నా వెంటనే యజమానికి మెసేజ్ పంపుతుంది.
