భూముల అమ్మకాన్ని మానుకోండి : ఎంపీ లక్ష్మణ్

భూముల అమ్మకాన్ని మానుకోండి : ఎంపీ లక్ష్మణ్
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ లక్ష్మణ్ డిమాండ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భూముల అమ్మకం ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన భూములను వెనక్కి ఇవ్వాలని అడుగుతున్న తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌.. వాటిని కూడా అమ్మాలని యోచిస్తోందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో భూముల అమ్మకాలను అడ్డుకుంటామన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఎన్నికలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

గ్రామాల్లో పాలన కుంటుపడి ందని, బిల్లులు రాక కొందరు సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని గుర్తుచేశారు. మరోవైపు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఆ మాట నిలబెట్టుకోలేక ఇతరులపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించామని, రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు పంపించామంటే కుదరదన్నారు. 

నిబంధనల ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని, ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పరిశీలిస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైమ్​లో తన ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ జరిగి ఉండొచ్చని, అయితే, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం, ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్, ఈ–ఫార్ములా రేస్‌‌‌‌‌‌‌‌ కేసులు సీబీఐకి అప్పగిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు.