- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
రామాయంపేట, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడంతో ఇటీవల హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసేందుకు ప్రభుత్వం సముఖంగా ఉండడం శుభపరిణామమని, కానీ గత ప్రభుత్వం మాదిరిగా ఉద్యోగులను మళ్లీ మోసం చేయొద్దని, హామీ ప్రకటనలకే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు.
మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైస్ మిల్లర్లు, దళారులు, ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని, సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాష్ట్రానికి అంకితం చేయబోతున్నారని ప్రకటించారు. ఈ సభకు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, అవినాశ్రెడ్డి పాల్గొన్నారు.
