
- కంపెనీ ప్రతినిధులను కోరిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని ఆ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబులు కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగుళూరు అనుకూలమైన ప్లేస్లని ప్రతినిధులకు సీఎం వివరించారు. బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్ డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇప్పటికే హైదరాబాద్లో డిఫెన్స్కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని, దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని ప్రతినిధులకు సీఎం వివరించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్ను ఎంచుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ ఇచ్చారు. సీఎం ప్రతిపాదనలకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం సానుకూలంగా స్పందించింది.