- రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లు తయారు చేసే వన్ మోటో తెలంగాణలో తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జహీరాబాద్ లేదా చంగిచర్లలో ప్రభుత్వం భూమి కేటాయించే అవకాశం ఉందని, జాగా రాగానే నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. "ప్లాంట్ ప్రారంభించిన మొదటి దశలో కనీసం 40 వేల యూనిట్లను తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. రెండేళ్లలో కెపాసిటీని లక్ష వరకు తీసుకెళ్తాం. కొంతకాలం తరువాత ఇక్కడే ఫోర్ వీలర్లనూ తయారు చేస్తాం" అని వన్ మోటో ఇండియా కో–ఫౌండర్, పార్ట్నర్ సమీర్ మొయినుద్దీన్ చెప్పారు.
15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కొత్త తయారీ ప్లాంట్లో సెమీ రోబోటిక్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తామని వెల్లడించారు. వన్ మోటో ఇండియా సీఈవో శుభాంకర్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్లాంట్ వల్ల దాదాపు 500 మందికి జాబ్స్ వస్తాయని, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వన్ మోటో మూడు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. - బైకా, ఎలెక్టా, కమ్యుటాలను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.1.80 లక్షలు, రూ.రెండు లక్షలు, రూ.1.30 లక్షలు. బ్రిటిష్ మొబిలిటీ కంపెనీ అయిన వన్ మోటోను ఇండియాలో ఎల్లీసియం ఆటోమోటివ్స్ ప్రమోట్ చేస్తోంది. దీనికి ఇప్పటికే 75 మంది డీలర్లు ఉన్నారు. బ్రాండ్ హెడాఫీసు హైదరాబాద్లో ఉంది.