పార్లమెంట్ పై బీఆర్ఎస్​ ఫోకస్ ..జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు

పార్లమెంట్ పై  బీఆర్ఎస్​ ఫోకస్ ..జనవరి 3 నుంచి  నియోజకవర్గాల వారీగా సమావేశాలు
  •     ఎల్లుండి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు
  •     ప్రత్యేక స్ట్రాటజీస్​ రూపొందిస్తున్న హైకమాండ్
  •     అసెంబ్లీ ఎన్నికల తప్పులు రిపీట్​ కాకుండా జాగ్రత్తలు

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికలపై బీఆర్ఎస్​హైకమాండ్ ​ఫోకస్​పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్​కాకుండా జాగ్రత్త పడుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​వచ్చే అవకాశముండటంతో ముందే ఎన్నికలకు ప్రిపరేషన్​షూరూ చేసింది. బుధవారం నుంచి లోక్​సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి లోక్​సభకు కేంద్ర హోం మంత్రి అమిత్​షా, కాంగ్రెస్​పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయా పార్టీలు వేస్తున్న అడుగులకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రత్యేక స్ట్రాటజీలు రూపొందిస్తున్నట్టుగా పార్టీ పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా మెదక్​, మహబూబ్​నగర్, ఖమ్మం పార్లమెంట్​నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్​ముఖ్య నేతలు పోటీకి దిగొచ్చనే అంచనాతో వారిని ఢీకొట్టేందుకు బీఆర్ఎస్​లోని టాప్ లీడర్లు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్​షా, సోనియా, ప్రియాంక రాష్ట్రం నుంచి పోటీకి దిగితే వారిని ఢీకొట్టడానికి పార్టీ టాప్​లైన్​నేతలే రెడీ అవుతున్నారు. తాము కాకుండా వేరే లీడర్లను అక్కడ పోటీకి దింపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాంటి వాటికి ముందే చెక్​పెడితే ఎన్నికలను ఎదుర్కోవడం అంతకష్టం కాదని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు.

ఫిబ్రవరిలో కేసీఆర్ రీ ఎంట్రీ!

ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ ​నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్​చార్జిలతో కేటీఆర్​ తెలంగాణ భవన్​లో సమావేశమయ్యారు. లోక్​సభ ఎన్నికల్లో సిట్టింగ్​సీటు చేవెళ్లను నిలబెట్టుకోవాలని.. అందుకే ఇప్పటి నుంచే ఫీల్డ్​లో ఉండాలని నాయకులకు సూచించారు. హిప్​ రీప్లేస్​మెంట్​ సర్జరీ తర్వాత కోలుకుంటున్న బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్ జనవరి నెలాఖరుకు పూర్తిగా రికవరీ అవుతారని, ఆపై ఆయన ఆధ్వర్యంలోనే లోక్​సభ ఎన్నికల స్ట్రాటజీలపై సమావేశాలు ఉంటాయని నాయకులు చెప్తున్నారు. బుధవారం నుంచి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​అధ్యక్షతన లోక్​సభ నియోజకవర్గాలవారీగా రివ్యూలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన పెద్దపల్లి, మహబూబ్​నగర్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్​కర్నూల్ ​నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ నెల 3న ఆదిలాబాద్​ లోక్​సభ స్థానంతో నియోజకవర్గాలవారీగా పార్టీ సన్నద్ధతపై సమావేశం నిర్వహిస్తున్నారు. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్​, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్​, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్​సభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల సంక్రాంతి పండుగ విరామం తర్వాత 16వ తేదీ నుంచి మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 16న నల్గొండ, 17న నాగర్​కర్నూల్, 18న మహబూబ్​నగర్, 19న మెదక్, 20న మల్కాజ్​గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్​నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల ఫైనల్

2009 లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​11 స్థానాల్లో విజయం సాధించగా, 2019లో 9 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్​అధికారం కోల్పోయింది. కాంగ్రెస్​64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​39 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్ర ప్రజల్లో తమకు ఆదరణ ఉందని చూపించుకోవాలనే ప్రయత్నాల్లో బీఆర్ఎస్​ఉంది. ఈక్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు పడుతోంది. నియోజకవర్గ స్థాయిలో నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొనే అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతి లోక్​సభ నియోజకవర్గంలోని ముఖ్య నేతలందరినీ సమీక్ష సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఇదే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్​మార్టం నిర్వహించడంతో పాటు లోక్​సభ ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్లాలో చర్చించి నిర్ణయాలు తీసుకోకున్నారు. కేసీఆర్​ కోలుకున్నాక మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్​ పోటీపై క్లారిటీ వస్తుందని, అప్పటి వరకు రాష్ట్రంలోని హైదరాబాద్​మినహా మిగతా 16 లోక్​సభ స్థానాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించామని బీఆర్ఎస్​ముఖ్య నేతలు చెప్తున్నారు.