V6 News

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు లో తెలంగాణ టాప్

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు లో తెలంగాణ టాప్
  • రాష్ట్రంలోని 73.82 లక్షల పట్టాదారులు
  •  43,59,371 మంది రైతుల నమోదు
  • 110% టార్గెట్​ను రీచ్​ అయిన రాష్ట్రం 
  • ప్రోత్సాహకంగా రూ.424 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: డిజిటల్ వ్యవసాయ విప్లవంలో తెలంగాణ మరోసారి అగ్రగామిగా నిలిచింది. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని 110%  అధిగమించి దేశంలో టాప్ స్థానంలో నిలిచింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం పట్టాదారుల సంఖ్య 73.82 లక్షలు ఉండగా, కేంద్రం 39,77,791 మంది రైతుల రిజిస్ట్రీ నమోదును టార్గెట్​ విధించింది. 

అయితే, తెలంగాణ 43,59,371 మంది రైతులను విజయవంతంగా నమోదు చేసి 110% సాధించింది. ఇది దేశవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీలో అత్యుత్తమ పనితీరుగా నిలిచింది.  దేశంలో 3 రాష్ట్రాలు ఈ ఘనత సాధించగా, అందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. 

ఈ  విజయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.422.64 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు, క్షేత్ర సిబ్బంది, సాంకేతిక బృందాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి ఈ విజయాన్ని సాధించారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి కృషి, సమన్వయం, అంకితభావాన్ని  ప్రశంసించారు.