
- రొటీన్ చెక్ అప్.. మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు
- వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఈజీ
- కాంగ్రెస్ ఫైల్యూర్సే బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్
- కేటీఆర్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. అందుకే నోటీసులపై స్పందించా!
- స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలె
- లేకుంటే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తం
- దీనిపైనే 17న మెదక్ లో రౌండ్ టేబుల్ మీటింగ్
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిట్ చాట్
హైదరాబాద్: కేసీఆర్ సంపూర్ణంగా ఆరోగ్యంగానే ఉన్నారని, రొటీన్ చెక్ అప్ కోసమే ఏఐజీ ఆస్పత్రికి వచ్చారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం విచారణ సందర్భంగా ఫాంహౌస్ కు వెళ్లిన కవిత కేసీఆర్ ను కలవలేదనేది మీడియాలో ప్రధానంగా వచ్చింది. దీనిపై ప్రశ్నించగా నో కామెంట్ అంటూ దాటవేశారు. ఈ విషయంపై తాను మాట్లాడితే బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వదని, అందుకే ఆ విషయంపై సమాధానం చెప్పడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ 18 నెలల పాలనలో ఫెయిల్యూర్ అయ్యిందని, అదే బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కాబోతోందని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, రైల్ రోకోలు చేయనున్నట్టు ఆమె తెలిపారు. ఇదే అంశంపై ఈ నెల 17న మెదక్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉద్యోగి మాత్రమేని , ముందు ఆయన కొలువు కాపాడుకోవాలని అన్నారు. తమ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. వాళ్ల అధినాయకత్వమే రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. కేటీఆర్ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టే స్పందించానని కవిత చెప్పుకొచ్చారు. మే నెలలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే స్పందించానని అన్నారు. అలాగే ఇప్పుడూ స్పందించానని తెలిపారు.