పాక్ నుంచి భారత్లో చొరబడిన  డ్రోన్ కూల్చివేత

 పాక్ నుంచి భారత్లో చొరబడిన   డ్రోన్ కూల్చివేత

అమృత్సర్ : భారత్, పాక్ సరిహద్దులో డ్రోన్ల కలకలం కంటిన్యూ అవుతోంది. పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన మరో డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్ సర్ రూరల్ జిల్లా చహర్ పూర్ ప్రాంతంలో జరిగింది ఘటన.

పాక్ భూభాగం నుంచి భారత్ లోకి ప్రవేశించిన డ్రోన్ ను భద్రతా బలగాలు పసిగట్టి కూల్చివేశాయి. ఆ తర్వాత డ్రోన్ కూలిన ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేయగా.. సరిహద్దు ఫెన్సింగ్ వైపున ఉన్న పొలంలో డ్రోన్ పడిపోయిందని, అందులో తెలుపు రంగు పాలిథిన్ కవర్ లో అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు  బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

సోమవారం రాత్రి కశ్మీర్ లోని సాంబా సరిహద్దు రాజ్ పురా ప్రాంతంలోనూ గుర్తు తెలియని డ్రోన్ సంచరించింది. ఎరుపు, పసుపు లైట్లతో ఎగురుతూ కనిపించగా..డ్రోన్ కదలికగా అంచనా వేస్తున్నారు. 25న సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ కు చెందిన డ్రోన్ లు జారవిడిచిన ఆయుధాలను భద్రతా బలగాలు  స్వాధీనం చేసుకున్నాయి. ఐఈడీతో పాటు చైనాలో తయారైన రెండు పిస్టల్స్, భారీ మొత్తంలో బుల్లెట్లు, ఐదు లక్షల భారతీయ కరెన్సీని గుర్తించారు. భారత్ లో టెర్రరిజాన్ని ప్రోత్సహించేందుకు పాక్ నుంచి ఆయుధాలు, డబ్బు పంపినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.