ఫాంహౌస్ కేసు : సీబీఐ చేతికి హైకోర్టు ఆర్డర్ కాపీ

ఫాంహౌస్ కేసు : సీబీఐ చేతికి హైకోర్టు ఆర్డర్ కాపీ

ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ సీబీఐ చేతికి అందింది. దీంతో సీబీఐ ఏక్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాఫీనీ సీబీఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

మరోవైపు ఫాంహౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వ రిట్ అప్పీలుపై దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ఉదయం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ వాదనలు కొనసాగించారు. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదని అన్నారు.

ప్రతిపాదిత నిందితుల తరఫున వాదనలు వినిపించిన సీతారామ్మూర్తి రిట్ అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై రిట్ అప్పీల్కు అవకాశంలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రివిజన్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.