భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంటే చట్ట సవరణ: సీఎం రేవంత్​రెడ్డి

భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంటే చట్ట సవరణ: సీఎం రేవంత్​రెడ్డి
  • ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం
  • పెండింగ్ దరఖాస్తులకు వచ్చే నెల మొదటివారం నుంచి పరిష్కారం
  • ఎక్కడికక్కడ తహసీల్దార్​ ఆఫీసుల్లో ప్రక్రియ స్టార్ట్​ కావాలి
  • రైతుల భూవివరాలను విదేశీ కంపెనీలకు గత సర్కార్​ అప్పగించుడేంది?
  • విలువైన భూములను ఇతరుల పేరిట మార్చలేదని గ్యారంటీ ఏముంది?
  • అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నయ్​
  • ధరణిలోని లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా స్టడీ చేయాలి
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం.. ధరణి కమిటీతో రివ్యూ

హైదరాబాద్​, వెలుగు: ధరణి కమిటీ ఇచ్చే ఫైనల్​ రిపోర్టు ఆధారంగా రైతుల భూ రికార్డు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయడం, లేదా కొత్త చట్టం తీసుకువచ్చే అంశాలను పరిశీలిద్దామని అధికారులతో ఆయన అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీకి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎందుకు అప్పగించిందని, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.


అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ధరణి కమిటీతో శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్​వోఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీకి చెప్పారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్వోఆర్​ చట్టంలోనే లోపాలు

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ముఖ్యమంత్రికి ధరణి కమిటీ  నివేదించింది. అప్పుడు కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని తెలిపింది. ఆ రికార్డులనే అప్పటి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని పేర్కొంది. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి ధరణి కమిటీ తీసుకెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపింది. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది. 

ఏకంగా కంపెనీలనే మార్చుడేంది?

భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా?  అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని ఆయన అన్నారు. ‘‘బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే అప్పటి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా? మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూముల పేర్లు మార్చలేదనే గ్యారంటీ ఏముంది? కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి.  ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా..?” అని రెవెన్యూ అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆరా తీశారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో వి.లచ్చిరెడ్డి,  ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్​ అప్లికేషన్లు క్లియర్​ చేయండి

ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. 

రైతుబంధుకు ధరణి డేటానే ప్రామాణికంగా తీసుకున్నరు

ధరణి డేటాను రైతు బంధు కోసం వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకున్నదని ధరణి కమిటీ రివ్యూలో చర్చకు వచ్చింది. ఇట్ల ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.