రేపు తిరుమలకు సీఎం వైఎస్‌ జగన్‌

రేపు తిరుమలకు సీఎం వైఎస్‌ జగన్‌
  • శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం తిరుమలకు వస్తున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఎల్లుండి మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్ 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్‌ హాస్పిటల్‌ చేరుకుంటారు. అక్కడ చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడి నుంచి  అలిపిరికి వచ్చి శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. 
సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు.  అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు, తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
12న మంగళవారం షెడ్యూల్‌
తిరుమలలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఎల్లుండి మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిధి గృహానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు వెళతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.