
ఖమ్మం రూరల్, వెలుగు : మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్రెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. రిటైనింగ్ వాల్, డ్రెయిన్, రోడ్డు నిర్మాణాలు, పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్త్ వర్క్ 41 శాతానికి పైగా, సిమెంట్ కాంక్రీట్ పనులు 32 శాతం మేర పూర్తయినట్లు, నగరం నుంచి వివిధ డ్రెయిన్ల నుంచి వచ్చే వరద నీరు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యల గురించి అధికారులు వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్నేరు నదికి ఇరువైపులా ఎనిమిదిన్నర కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, దీని కోసం 138 ఎకరాల పట్టా భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ భూమి, అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాలా అభివృద్ధి చేసి, భూ నిర్వాసితులకు పరిహారంగా అందించేలా ఒప్పించాలని సూచించారు.
ఇప్పటి వరకు 70 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టాదారులు ఒప్పుకున్నట్లు, మిగతా వారితో చర్చించి పనులు స్పీడప్ చేయాలన్నారు. మున్నేరు వరదలతో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు ఉన్నారు.