తెలంగాణలో 6 రోజుల్లో 7,770 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణలో 6 రోజుల్లో 7,770 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • పంట పండే ప్రతి గుంట భూమికి అందిస్తం
  • ఔటర్ లోపల సాగులో ఉన్న భూములకే చెల్లిస్తం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో కేవలం 6 రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.7,770.83 కోట్ల నిధులను విడుదల చేశామని, ఈ ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నిధుల విడుదలను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2.18 లక్షల ఎకరాల్లో దాదాపు 93 వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనర్హ భూములుగా గుర్తించామని.. మిగిలిన 1.20 లక్షల ఎకరాల సాగు భూములకు రైతు భరోసా నిధులను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. 

ఓఆర్ఆర్​లోపల సాగు భూములను గుర్తించడంలో సమయం పట్టినప్పటికీ, సదుద్దేశంతోనే ఈ ప్రక్రియ జరిగిందని, దీనిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని బీఆర్ఎస్​ నాయకులు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్​పార్టీని ప్రజలు, రైతులు కోతల ప్రభుత్వంగా భావించి తిరస్కరించారని, వారి హయాంలో రైతు బంధు నిధుల విడుదల సమయం, రుణమాఫీ అమలును గుర్తుచేస్తూ మంత్రి విమర్శలు గుప్పించారు. 

2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నిధులను 2 నెలల కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ విడుదల చేయలేదన్నారు. ఎక్కువలో ఎక్కువ గరిష్ఠంగా రూ.7,624 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు రోజుల్లోనే రూ.7,770.83 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అంతేగాక, 2 లక్షల రుణమాఫీని ఒకేసారి అమలు చేశామని గుర్తుచేశారు.

ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగమే మా లక్ష్యం 

 పంట పండే ప్రతి గుంట భూమికి రైతు భరోసా అందించే బాధ్యత తమదని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగం కావాలనేదే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల తరఫున పేటెంట్లు తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నారని, వారి హయాంలో రైతుబంధు, రుణమాఫీలోని లోపాలను గుర్తుచేసుకుంటే రైతుల ముందుకు వచ్చే మొఖం ఉండదని విమర్శించారు.

 ఓఆర్ఆర్ లోపల సాగు భూముల గుర్తింపు విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.