- లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కానిస్టేబుల్ యాదయ్య
- ఎస్సైకి ఇరవై వేలు, తనకు ఐదు వేల రూపాయలని ఏసీబీకి తెలిపిన కానిస్టేబుల్
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో 25 వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ యాదయ్య(ఎస్ఐ రైటర్) అడ్డంగా బుక్కయ్యాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజ్, మరో ఐదుగురు వ్యక్తులపై భూ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ 41 సీఆర్పీసీ నోటీస్ ఇవ్వటానికి, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ యాదయ్య రూపాయలు 25వేలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో ఎస్ఐకి 20వేలు, కానిస్టేబుల్ యాదయ్య కు 5వేలు అని డబ్బులు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ యాదయ్య డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు. ఇవాళ మంగళవారం కానిస్టేబుల్ యాదయ్య రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.